WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:21 pm Digital Edition : Ravi Goli

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం

గణపురంలో అట్టహాసంగా బాబాసాహెబ్ జయంతి

మోడల్ స్కూల్ టాపర్లకు ఎమ్మెల్యే గండ్ర సన్మానం

రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలి

(గణపురం – వరంగల్ వాయిస్ ): ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను గణపురం మండల కేంద్రంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై, బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన గణపురం మోడల్ స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే గండ్ర ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు శాలువాలు కప్పి సన్మానించి, అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారని, నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే నేడు మనమందరం రిజర్వేషన్లు, హక్కులను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన పడ్డ తపన దేశ భవిష్యత్తును మార్చివేసిందని కొనియాడారు. రాజ్యాంగ విలువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్టంగూరు రాం నరసింహారెడ్డి, అయిత ప్రకాష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్, గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రేపక రాజేందర్, డైరెక్టర్ కటుకూరు శ్రీనివాస్, అప్పయ్యపల్లి సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు దూడపాక శంకర్, మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు బొల్లి బాబు, డీఎస్పీ జిల్లా కార్యదర్శి కండ రవి మరియు వివిధ సంఘాల నేతలు, పత్రికా మిత్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.