WarangalVoice
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 3:53 pm Digital Edition : Ravi Goli

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణం

వరంగల్ వాయిస్, దామెర : అప్పుల బాధ తాళలేక, మానసిక మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరుగొండ గ్రామానికి చెందిన చెట్టిపల్లి విజేందర్ (50, తండ్రి: రాజీరు, కులం: ఆరే) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతనికి అప్పులు ఎక్కువగా అయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఆ అప్పులను ఎలా తీర్చాలో తెలియక, ఆర్థిక ఇబ్బందులతో విజేందర్ గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విజేందర్ సోమవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని వసతిని చూసుకుని, ప్లాస్టిక్ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆవేదనతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మృతుడి భార్య చెట్టిపల్లి లక్ష్మి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు జరుపుతున్నట్లు దామెర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.