వరంగల్ వాయిస్, దామెర : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండలంలో సాగుతున్న ఓటర్ల ఇంటింటి సర్వే విధుల్లో ఉన్న బీఎల్ఓలు తప్పనిసరిగా ఐడీ కార్డు, క్యాప్, టీ-షర్ట్ ధరించి విధులను నిర్వర్తించాలని దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి ఆదేశించారు. మంగళవారం దామెర మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో కొనసాగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026’కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారమ్లను పంపిణీ చేస్తూ, ఓటర్ల నుండి వివరాలను సేకరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి మాట్లాడుతూ.. బీఎల్ఓలు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల ఫారమ్లను అందించాలని, వీటిని బీఎల్ఏలకు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ముస్త్యాలపల్లి గ్రామంలో మొత్తం 1004 మంది ఓటర్లు ఉన్నారని, నిర్దేశిత గడువులోగా ఫారాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో మరణించిన ఓటర్ల వివరాలను సేకరించి, వాటిని వెంటనే ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేందుకు ప్రజలందరూ బీఎల్ఓలకు సహకరించి, సరైన వివరాలతో కూడిన ఫారమ్లను నింపి అందించాలని కోరారు. ఓటర్ల సర్వే తనిఖీ అనంతరం ముస్త్యాలపల్లి గ్రామంలో నిర్వహించిన ‘పౌర హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సూపర్వైజర్లు, బీఎల్ఓలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.