వరంగల్ వాయిస్, హనుమకొండ : శ్రీ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో, సంఘం అధ్యక్షులు పాసికంటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం హనుమకొండలోని రాజా శివాజీ బార్అడ్డా వద్ద భారీ ఉచిత వైద్య శిబిరం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ ప్రఖ్యాత శరత్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపును సంఘం ముఖ్య సలహాదారు పాసికంటి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానికులకు, కుల బాంధవులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు కోట భద్రయ్య ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పాసికంటి శ్రీనివాస్, పాసికంటి సత్యప్రకాష్, సిరిమల పున్నంచందర్, కుల బాంధవులు, పరపతి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షుడు పాసికంటి రాజేంద్రప్రసాద్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, కుల బాంధవులందరూ తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించి సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.