WarangalVoice
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 1:56 pm Digital Edition : Ravi Goli

కన్నుల పండువగా జంజిరాల పున్నమి వేడుకలు

ఘనంగా జంజిర ధారణ, హోమ వేడుకలు

మగ్గంతో కూడిన రథయాత్ర, భారీ బైక్ ర్యాలీతో హోరెత్తిన కమలాపూర్

సాంస్కృతిక శోభతో అట్టహాసంగా పద్మశాలీల సంబరాలు

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని పద్మశాలి కులస్తులకు అత్యంత విశేషమైన ‘జంజిరాల పున్నమి’ వేడుకలను హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి సంఘ భవనంలో మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య యజ్ఞోపవేతం, గాయత్రి మంత్ర పఠనంతో జంజిర ధారణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు ముగించుకుని, పద్మశాలీలు ప్రధాన రహదారి వెంట మగ్గంతో కూడిన రథయాత్రను అట్టహాసంగా కొనసాగించారు. ఈ రథయాత్రకు పద్మశాలి కులస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, జై పద్మశాలి నినాదాలతో హోరెత్తించారు. యువకులు పెద్ద ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాణాసంచా పేలుళ్లు, డీజే పాటల హోరు మధ్య సాగిన ఈ రథయాత్ర బస్టాండ్ కూడలి వరకు కొనసాగింది. యాత్ర మార్గమధ్యంలో యువకులు, కులబాంధవులు కోలాటాలు, నృత్యాలతో హోరెత్తించడంతో కమలాపూర్ ప్రధాన వీధులు పద్మశాలి సంస్కృతి, సంప్రదాయాలతో మార్మోగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్ మాట్లాడుతూ.. జంజిరాల పున్నమి వేడుకలు పద్మశాలీల గొప్ప సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్, ప్రధాన కార్యదర్శి పోరండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, యూత్ కమిటీ అధ్యక్షులు ఆడెపు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మార్గం చైతన్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బైరీ జనార్ధన్, పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వెల్ది రాఘవులు, సంఘ నాయకులు మెండు రమేష్, చేరాల రోహిత్, తుమ్మ శోభన్ బాబు, రాజేష్, చందనాల సాంబయ్య, చేనుమల్ల శ్రీకాంత్, కనుకుంట్ల ఆంజనేయులు, నాసని రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.