WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:31 pm Digital Edition : Ravi Goli

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులదే కీలక పాత్ర

ఎంపీడీఓ గుమ్మడి కల్పన

వరంగల్ వాయిస్, దామెర : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు అత్యంత కీలక పాత్ర పోషించాలని దామెర మండల ప్రజా పరిషత్ అధికారి గుమ్మడి కల్పన పిలుపునిచ్చారు. మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంతో పాటు ఊరుగొండ గ్రామంలోని రైతు వేదికలలో మండల పరిధిలోని గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన మాట్లాడుతూ.. స్థానిక పరిపాలనలో వార్డు సభ్యుల పాత్రను విస్మరించలేమని అన్నారు. శిక్షణలో భాగంగా వారు ప్రధానంగా క్రింది అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన. వార్డు ప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిర్వహించాల్సిన విధులు. గ్రామాల్లోని ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంలో అనుసరించాల్సిన అధికారిక విధానాలు. వార్డ్ సభ్యులు తమ విధులు, బాధ్యతలపై మరింత పట్టు సాధించి, గ్రామాల రూపురేఖలు మార్చేందుకు, సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అధికారులు ఆకాంక్షించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ వార్డుల సభ్యులు, మండల పరిషత్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.