వరంగల్ వాయిస్, చిట్యాల: మండల కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు, స్థానిక సంఘాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న లారీ యూనియన్ సమీపంలో బుధవారం రెండు అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ లారీ యూనియన్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై, ఆ ప్రాంతంలో భద్రత దృష్ట్యా సీసీటివి కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్ఐ పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా భావించి, తమ సొంత ఖర్చులతో తమ కార్యాలయం, ఆలయ సమీపంలో నిఘా పెంచేందుకు ఈ కెమెరాలను బిగించారు. గ్రామాల్లోని ఇతర వ్యాపార సంస్థలు, సంఘాలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి తమ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరరహిత మండలంగా తీర్చిదిద్దవచ్చని పోలీసులు పిలుపునిచ్చారు.
