సంఘం బలోపేతమే లక్ష్యం
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఈసీ సమావేశంలో తీర్మానం
వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో జర్నలిస్టులకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తిపరమైన శిక్షణ అందించేందుకు మీడియా అకాడమీ సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఈసీ సమావేశం తీర్మానించింది. బుధవారం బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి అధ్యక్షతన జరిగిన తొలి ఈసీ సమావేశంలో సంఘం బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీల అంశంపై అధికారులతో చర్చించి ఉత్తర్వులు వచ్చేలా కృషి చేస్తామన్నారు. సంఘానికి దూరమైన నాయకులను తిరిగి ఆహ్వానిస్తామని తెలిపారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం మాట్లాడుతూ సంఘ నియమ నిబంధనలు ప్రతి సభ్యుడు పాటించాలని, వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. అర్హులైన ప్రతి సభ్యుడికి సంఘం పరంగా సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కోశాధికారి పొడిచెట్టి విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెళ్లి మధు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, పీవీ మదన్మోహన్, వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, బోళ్ల అమర్, రామచందర్, దుర్గాప్రసాద్, పిన్నా శివకుమార్, గడ్డం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.