WarangalVoice
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 2:23 pm Digital Edition : Ravi Goli

జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో ఘనత

ఇద్దరు ఓరుగల్లు విద్యార్థులకు కాంస్య పతకాలు

వరంగల్ వాయిస్, వరంగల్ : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఓరుగల్లు కీర్తిని జాతీయ వేదికపై చాటారు. ఒడిస్సాలోని ఖుర్దాలో మే 30వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన ‘మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ’ విద్యార్థులు కార్తీక్ పరిశి, గణేష్ పూసల అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించి తిరిగొచ్చిన యువ క్రీడాకారులు కార్తీక్, గణేష్‌లను ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గడదాసు మణికంఠ అకాడమీ వేదికగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గట్టి పోటీదారులను ఎదుర్కొని మన విద్యార్థులు కాంస్య పతకాలు సాధించడం వరంగల్ జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. వారి కఠిన శ్రమ, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. జాతీయ వేదికపై ఓరుగల్లు క్రీడాకారులు పతకాలతో మెరవడం పట్ల కోచ్ మణికంఠతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు, స్నేహితులు, స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వీరు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.