WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 4:37 pm Digital Edition : Ravi Goli

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి

కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు

భారీ మెజారిటీతో విజయం

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో నూతన అధ్యక్ష, కార్యదర్శులు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయి) భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కోశాధికారితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ అధికారికంగా ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 407 ఓట్లకు గాను 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్‌కు కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. (5 ఓట్లు చెల్లకుండా పోయాయి). దీంతో కేశవమూర్తి తన ప్రత్యర్థిపై 204 ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. కార్యదర్శి పదవికి పోటీ పడ్డ ఊటుకూరి సాయిరాం (సాయి) కు 204 ఓట్లు రాగా, ప్రత్యర్థి మేరుగు రాజేంద్రప్రసాద్‌కు 7 ఓట్లు లభించాయి. (6 ఓట్లు చెల్లలేదు). దీంతో సాయిరాం తన ప్రత్యర్థిపై 197 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఏకగ్రీవమైన నూతన కార్యవర్గంలో అధ్యక్ష, కార్యదర్శి స్థానాలు మినహా మిగిలిన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయి), కోశాధికారిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు దండుమోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయభాస్కర్, అల్లె రామారావు, సహాయ కార్యదర్శులు జి.బాలరాజు, గన్ను సంతోష్ కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్ పాషకార్యవర్గ సభ్యులు డి.రాధాకృష్ణ, జి.రామానుజం, ఆర్వీ దామోదర్, పి.ప్రదీప్ రాజ్, ఎండీ జమాలొద్దీన్, ఎ.సాంబశివరాజు, ఎండీ ఉస్మాన్ పాష, ఎండీ ఫజర్ ఉర్ రహమాన్, ఎ.విష్ణువర్ధన్ రాజు, ఆర్. శ్రీధర్, ఎం.ఓదెలు, ఓదెల శివకుమార్, కొట్టె సుధాకర్, పులికంటి రాజేందర్, ఎం. సంతోష్ కుమార్, ఇ.జగన్, ఏ.కొమ్మాలులు ఎన్నికయ్యారు.

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..

ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ మాట్లాడుతూ.. నూతన కమిటీ జర్నలిస్టుల హక్కుల సాధన, వారి సంక్షేమమే ధ్యేయంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన బాధ్యులకు జిల్లాలోని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల పాటు ఎంతో ఓపికతో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన రిటర్నింగ్ అధికారి కంకణాల సంతోష్, సహాయ రిటర్నింగ్ అధికారులను, అబ్జర్వర్లుగా వ్యవహరించిన గాడిపెల్లి మధు, పీవీ మదన్ మోహన్, పిన్నా శివకుమార్, వల్లాల వెంకటరమణ, పెండెం వేణుమాధవ్‌లతో పాటు ఇతర ఎన్నికల సిబ్బందిని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణలు ప్రత్యేకంగా అభినందించారు.