WarangalVoice
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:35 pm Digital Edition : Ravi Goli

డీసీసీబీ ఉద్యోగుల ఇన్సెంటివ్ రికవరీ నిర్ణయం అన్యాయం

హనుమకొండ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగుల నిరసన

మూడవ రోజుకు చేరిన ఆందోళనలు..

నిర్ణయం రద్దుకు డిమాండ్

వరంగల్ వాయిస్, హనుమకొండ : డీసీసీ బ్యాంకు ఉద్యోగులకు గతంలో మంజూరు చేసిన 2024, 2025 సంవత్సరాల ఇన్సెంటివ్, ఎక్స్ గ్రేషియాను తిరిగి రికవరీ చేయాలన్న హెచ్‌ఎల్‌సి కమిటీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా సాగుతున్న నిరసనల్లో భాగంగా, శుక్రవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వరుసగా మూడవ రోజు భోజన విరామ సమయంలో జరిగిన ఈ ఆందోళనలో ఉద్యోగ నాయకులు మాట్లాడారు. బ్యాంకులు ఆర్థికంగా లాభాలు గడించడంలో ఉద్యోగుల శ్రమ ఎంతో ఉందని, ప్రతి ఏటా ఆనవాయితీగా ఇచ్చే ఇన్సెంటివ్‌లు, బోనస్‌లను ఇప్పుడు తిరిగి రికవరీ చేయాలని చూడటం అత్యంత అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల ఉద్యోగులు మానసికంగా, ఆర్థికంగా కృంగిపోతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే రికవరీ నిర్ణయాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకులు బి.కృష్ణ మోహన్, జిల్లా నాయకులు నాగరాజు, రజిత, ప్రదీప్, రమ్యశ్రీ, ఐల,యు పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.