వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య మందిరం భవన నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఆసుపత్రి భవన నిర్మాణానికి కేటాయించిన నాలుగు గుంటల భూమిని సోమవారం రెవెన్యూ అధికారుల సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అధికారికంగా అప్పగించారు. మండల కేంద్రంలో సుమారు నాలుగు గుంటల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి, సరిహద్దులను గుర్తించిన అనంతరం ఈ ల్యాండ్ హ్యాండోవర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ నూతన ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే మండల పరిధిలోని ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు వైద్య సేవలు మరింత దగ్గరవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలం అప్పగింత కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కృపావతి, స్థానిక సర్పంచ్ కల్పన కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మహేందర్, ఉపసర్పంచ్ బత్తిని రాజు యాదవ్, వార్డు సభ్యులు మీరల రజిత రవి, మంతుర్తి రాకేష్లతో పాటు పలువురు రెవెన్యూ, వైద్య శాఖల సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.