WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:21 pm Digital Edition : Ravi Goli

ప్రభుత్వ బడిలో చేరితే రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్

దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ నిర్ణయం

వరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు దామెర మండలం దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ నవీన్ ఒక అద్భుతమైన, వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరే ప్రతి విద్యార్థి పేరు మీద రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉన్నప్పటికీ అడ్మిషన్లు తగ్గకుండా చూసేందుకు సర్పంచ్ నవీన్ స్వయంగా ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. బడిలో చేరిన వెంటనే విద్యార్థి పేరిట ఈ ఐదు వేల రూపాయల నగదును డిపాజిట్ చేయనున్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు సర్పంచ్ నవీన్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామస్థులతో పాటు విద్యాశాఖ అధికారులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వినూత్న పథకం ద్వారా దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఇతర గ్రామ ప్రజాప్రతినిధులకు కూడా ఈ నిర్ణయం ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు.