సీపీఐ నేత మోతె లింగారెడ్డి
వరంగల్ వాయిస్, హసన్ పర్తి: దేశ సంపదను సృష్టిస్తున్న శ్రామిక వర్గం రోజురోజుకూ నిరుపేదలుగా మారుతుంటే, కోటీశ్వరులు మాత్రం శతకోటీశ్వరులుగా ఎదుగుతున్నారని, ఇది దోపిడీ పాలకవర్గాల వైఫల్యమేనని సిపిఐ నాయకులు మోతె లింగారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం హసన్ పర్తి మండలం ముచ్చెర్ల గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి సామూహిక విరాళాల సేకరణ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ.. సెంటు భూమి కూడా లేని దళిత, బహుజన నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ప్రభుత్వం ఎకరం భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హసన్ పర్తి మండల కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు మాదాసి బాబు, గోపు బుచ్చిరెడ్డి, నేదునూరి రామచందర్, వీసం రాజిరెడ్డి, సల్ల రవీందర్ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, వీసం ఇందిరమ్మ, సూరా రమేష్, కంచనకుంట్ల సుధాకర్ రెడ్డి, శేషాచలం తదితరులు పాల్గొన్నారు.