WarangalVoice
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 2:56 pm Digital Edition : Ravi Goli

సమాచార శాఖను బలోపేతం చేయాలి

వరంగల్ వాయిస్, హైదరాబాద్/వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ చేరాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ తన ప్రచార శైలిని మరింత ఆధునీకరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం సూచించారు. ఐఅండ్ పీఆర్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం సచివాలయంలో టీఎస్జేయూ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సమాచార శాఖ పాత్ర కీలకమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి, ప్రచార విభాగాలను బలోపేతం చేయడం ద్వారా పథకాల లబ్ధిని ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన ముకుంద రెడ్డి నేతృత్వంలో ఈ శాఖ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమాచార శాఖ బలోపేతంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారంపై కూడా కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్యం ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొని కమిషనర్‌ను ఘనంగా సన్మానించారు.