జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి…
వరంగల్ వాయిస్, హనుమకొండ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ,, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అనంతరం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డిసిపి ధార కవిత, ఆదనవు కలెక్టర్ రవి, డిఆర్ ఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
