రెండు టిప్పర్లు సీజ్
వరంగల్ వాయిస్, దామెర : మండలంలో మొరం తరలిస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం మధ్యాహ్నం దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కొంక అశోక్ గారు తెలిపిన వివరాల ప్రకారం.. పులుకుర్తి శివారు ప్రాంతం నుండి మొరం అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధనలు అతిక్రమించి సహజ వనరులను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
