దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్
(వరంగల్ వాయిస్ – దామెర): దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబాసాహెబ్ చిత్రపటానికి స్థానిక సర్పంచ్ దుబాసి నవీన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు నేడు దేశంలోని ప్రతి పౌరుడికి రక్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్కు శ్రద్ధాంజలి ఘటించారు.
