వరంగల్ వాయిస్, దామెర : మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ మరియు ‘ఇండి’ కూటమి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ దామెర మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు గర్జించాయి. శనివారం మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ కూటమి తీరును ఎండగడుతూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా నాయకులు గురిజాల శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. “ప్రధాని మోదీ గారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే, రాజకీయ లబ్ధి కోసం దానిని అడ్డుకోవడం ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఇలాంటి ద్వంద్వ రాజకీయాలకు కాలం చెల్లింది” అని హెచ్చరించారు. మహిళల గౌరవం, భద్రత మరియు సమాన హక్కుల కోసం నిబద్ధతతో పనిచేస్తున్నది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని నాయకులు స్పష్టం చేశారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళా లోకం బుద్ధి చెబుతుందని గట్టిగా ప్రకటించారు. సామాన్య మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నినదించారు. ఈ నిరసన కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కో-కన్వీనర్ మాదారపు రతన్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పవుడాల మధుకర్, మండల ప్రధాన కార్యదర్శులు సూర చందర్, గండు ముఖేష్ పాల్గొన్నారు. అలాగే మండల కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, నాయకులు గన్ను సతీష్, బిల్లా రమణారెడ్డి, సంతోష్ బాబు, కన్నె కొమురయ్య, నూకల రాజయ్య, బూత్ అధ్యక్షులు బి. రమేష్, వేల్పుల ప్రశాంత్, పిడుగు తిరుపతి, కావటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
