వరంగల్ వాయిస్, దామెర : దామెర పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు, అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరకాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిలను పలువురు సంఘాల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ సొప్పరి రాజేష్, జిల్లా పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ దుబాసి రమేష్, ఊరుగొండ సొసైటీ మత్స్యశాఖ వైస్ చైర్మన్ పాండవుల రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా శ్రమజీవులైన మత్స్యకారుల భద్రతకు, వారి సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఐ స్పష్టం చేశారు.
