వరంగల్ వాయిస్, దామెర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం దామెర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయం వద్ద నిరసన తెలిపి, నాయకులు మాట్లాడారు. ప్రధానంగా జూన్ 2 నాటికి కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న ఐదు డీయర్నెస్ అలవెన్స్ లను వెంటనే విడుదల చేయాలి. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ పొందిన వారికి తక్షణమే ఓపీఎస్ వర్తింపజేయాలి. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. జనాభా లెక్కల కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలి. రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, వీఆర్ఏల వారసుల నియామక సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించని యెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, సంపత్ రావు, వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
