వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కిన్నెర లలిత కుమారుడు కిన్నెర అభిలాష్ (26) గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కూలిపని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఓగ్లాపూర్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా.. గంగిరేణిగూడెంకు చెందిన ఎండీ అజారుద్దీన్ (30) తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి అభిలాష్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అభిలాష్ మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లి లలిత రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్ఐ ఇ.వీరభద్ర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
