ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్
వరంగల్ వాయిస్, రఘునాథ్పల్లి : రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా వాహనదారుల్లో మార్పు రావాలని రఘునాథ్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) దూదిమెట్ల నరేష్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షతన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని లోటును మిగిలిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం,డిప్రెషన్ డ్రైవింగ్ నియమాలను అతిక్రమించడం వల్లే మెజారిటీ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ నెల 16వ తేదీ వరకు మండల వ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవర యాకయ్య, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, వార్డు సభ్యులు యాదరాములు, ఇమ్మడిశెట్టి అనిత, సురేష్, శ్రీనివాస్, వీఓసీఏలు మినుముల పద్మావతి, కోళ్ల కీర్తన, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు కవిత, శ్రీలత, నాగమణి, ఆటో యూనియన్ అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాస్, గ్రామ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
