వరంగల్ వాయిస్, హసన్ పర్తి : పెగడపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో స్ప్రింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 80 మొక్కలను నాటారు. కార్యక్రమ అధ్యక్షత వహించిన హెచ్ఎం శ్రీమతి శోభ మాట్లాడుతూ.. మన పాఠశాలలో వనమహోత్సవానికి రూ.13,000 విలువైన 80 మొక్కలను ఉచితంగా అందజేసిన స్ప్రింగ్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులంతా కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని బాధ్యతగా రక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. స్ప్రింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి బోయినపల్లి రాధ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఎండలు తీవ్రం కావడం, వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడటం, త్రాగునీటి ఎద్దడి వంటి సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “భారత ఫారెస్ట్ మ్యాన్ జాదవ్ పేయింగ్ 40 మిలియన్ల మొక్కలు నాటి పద్మశ్రీ పొందగా, ట్రీ మ్యాన్ దరిపల్లి రామయ్య గారు 10 మిలియన్ల మొక్కలు నాటారు. మనం అంత పెద్ద పని చేయలేకపోయినా.. కనీసం మన పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షిస్తే చాలు” అని ఆమె అన్నారు. అలాగే, నాటిన ప్రతి మొక్కను ఇద్దరు విద్యార్థులు చొప్పున దత్తత తీసుకుని, వచ్చే ఏడాది ఇదే తేదీన ఆ మొక్కల జన్మదిన వేడుకలు జరపాలని ఆమె ఒక వినూత్న పిలుపునిచ్చారు.
