మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్ వాయిస్, పరకాల : నియోజకవర్గ కేంద్రంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరకాల పట్టణంలోని వార్డుల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని కొనియాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు త్వరలోనే వార్డుల వారీగా నూతన కమిటీలను వేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పరకాల పట్టణ కమిటీని కూడా త్వరలోనే ఎన్నుకుంటామని, ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. “రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని గ్రహించారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వారి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు” అని ధర్మారెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే పట్టణ స్థాయిలో విజయాలు సాధించగలమని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పరకాల పట్టణ మరియు మండల స్థాయి నాయకులు, వార్డు ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
