కొమల్ల టోల్ ప్లాజా వద్ద ‘అరైవ్ & అలైవ్’
‘రోడ్ సేఫ్టీ ఛాంపియన్’ స్టిక్కర్ల పంపిణీ
పోలీసుల వినూత్న ప్రచారం
కౌన్సిలింగ్ నిర్వహించిన రఘునాథపల్లి సీఐ, ఎస్సై
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనగామ జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన “ అరైవ్ అలివ్” క్యాంపెయిన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా 6వ రోజైన శనివారం కొమల్ల టోల్ ప్లాజా వద్ద రఘునాథపల్లి పోలీసులు వినూత్నంగా ‘జీరో ఎన్ఫోర్స్మెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించే పోలీసులు, ఈ క్యాంపెయిన్లో భాగంగా ఒక్క చలాన్ కూడా వేయకుండా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. రఘునాథపల్లి సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో వాహనదారులను ఆపి, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. సురక్షిత ప్రయాణ నియమాలను పాటిస్తామని హామీ ఇచ్చిన వాహనదారులను అభినందిస్తూ, వారి వాహనాలపై “అరైవ్ అలివ్ ఛాంపియన్ 2026” స్టిక్కర్లను పోలీసులు స్వయంగా అంటించారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ, ఎస్, పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు స్వీయ రక్షణపై దిశానిర్దేశం చేశారు.
