జనగామలో భూదాన్ సదస్సు విజయవంతం
వరంగల్ వాయిస్, జనగామ : స్థానిక కురుమ సంఘ భవనంలో తెలంగాణ సర్వోదయ మండల్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “భూదాన్ సదస్సు” ఘనంగా జరిగింది. బోలకొండ రవితేజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూదాన్ భూముల రక్షణ, పంపిణీపై ముఖ్య అతిథులు కీలక ప్రసంగం చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యేలకంటి గిరి ప్రసాద్ మాట్లాడుతూ, ఆచార్య వినోబా బావే 1951 నుంచి 1965 వరకు 14 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి 46 లక్షల ఎకరాల భూమిని సేకరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1.79 లక్షల ఎకరాల భూమి భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలో ఉందని తెలిపారు. ఒక్క జనగామ జిల్లాలోనే సుమారు 3 వేల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందన్నారు. విలువైన భూదాన్ భూములు అక్రమార్కుల ప పాలవుతుండటంపై గిరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. “కొంతమంది భూ బకాసురులు అక్రమంగా పట్టాలు సృష్టించి, పేదలకు దక్కాల్సిన భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర సర్వే చేయించి, ఈ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్వోదయ మండల్ జనగామ జిల్లా శాఖకు నూతన కన్వీనింగ్ కమిటీని ప్రకటించారు. జిల్లా కన్వీనర్ గా మిట్టపల్లి రాజు కుమార్, కో-కన్వీనర్లు: మొహమ్మద్ జాఫర్ షరీఫ్, కందుల సృజన్ కాంత్, గాదే సిద్దేశ్వర, రెడ్డి బాబురావు, కొట్టురు విజయ్ కుమార్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ఖాదర్ బేగ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబ మల్లేశం, మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ జాఫర్ షరీఫ్, వివిధ బీసీ సంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
