ఏడుగురు అరెస్ట్, నగదు స్వాధీనం
వరంగల్ వాయిస్, దామెర: మండల పరిధిలోని ఊరుగొండ గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై దామెర పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7,580ల నగదుతో పాటు, 6 సెల్ ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు దామెర సబ్ ఇన్స్పెక్టర్ కొంక అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా దామెర ఎస్ఐ కొంక అశోక్ మాట్లాడుతూ.. పేకాట వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సమాజానికి ఎంతో హానికరమని, ఇటువంటి వ్యసనాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎస్ఐ కోరారు. ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘిక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
