వరంగల్ వాయిస్, క్రైం :సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు స్టేషన్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ పూల మొక్కను అందజేశారు.అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు, స్టేషన్కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో నమోదవుతున్న నేరాలు, పరిధిలోని గ్రామాలు, ఆయా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై స్టేషన్ ఇన్స్పెక్టర్ కిషన్,ఎస్సై రాజ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు తప్పనిసరిగా రశీదు అందజేయాలని, ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లో ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
