ఉత్తర్వులు జారీ చేసిన తాటికొండ రాజయ్య
రఘునాథపల్లి శ్రేణుల్లో హర్షాతిరేకాలు
పార్టీ బలోపేతమే లక్ష్యమన్న కుమార్ గౌడ్
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : భారత రాష్ట్ర సమితి లింగాల ఘనపురం మండల ఇన్ఛార్జీగా రఘునాథపల్లి మండల మాజీ ఎంపీపీ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నేత వై.కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందనే దానికి కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన వివరిస్తూ, భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ పునాదులు పటిష్టంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుమార్ గౌడ్ నియామకం పట్ల రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఆయన నియామకం పట్ల మండల టోల్ గేట్ అధ్యక్షులు ఎండి. సమీర్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. కుమార్ గౌడ్ నాయకత్వంలో మండలంలో పార్టీ మరింత పుంజుకుంటుందని శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
