అధ్యక్షుడు మణికంఠ పిలుపు
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలో కిక్ బాక్సింగ్ క్రీడను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, నూతన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ,కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కాకతీయ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన వరంగల్ జిల్లా కమిటీ ఎనికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మణికంఠ తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8న ఉదయం 10:00 గంటలకు వరంగల్ పోచమ్మ మైదానం సమీపంలోని జికోటియా కాంప్లెక్స్ మూడవ అంతస్తులో ఉన్న ‘మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ’ వేదికగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడు మణికంఠ మాట్లాడుతూ.. నూతన కమిటీలో చేరాలనుకునే ఆసక్తి గల వారు, కిక్ బాక్సింగ్ రంగంలో రాణించాలనుకునే క్రీడాకారులు అందరూ ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోటీలు నిర్వహించడంతో పాటు వారిని రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “కిక్ బాక్సింగ్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. అది జీవితాన్ని మార్చే శక్తి. అందరం కలిసి మన బలాన్ని నిర్మిద్దాం, క్రీడా అభివృద్ధి కోసం ముందుకు సాగుదాం.” అని ఆయన పిలుపునిచ్చారు.
